04-08-2025 05:27:48 PM
మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి..
మందమర్రి (విజయక్రాంతి): వరి నాట్లు వేయడానికి ముందు వరి పొలంలో మడులను సూచించే గట్లను ఇరువైపులా తప్పనిసరిగా కత్తిరించాలని తద్వారా పొలం గట్లపై పెరిగే వివిధ రకాల కలుపుతో పాటు కీటకాలను నివారించవచ్చని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి కోరారు. మండలంలోని ఆదిల్ పేట గ్రామంలోని వ్యవసాయ పొలాలను సోమవారం పరిశీలించి రైతులకు గట్ల కత్తిరింపుపై అవగాహన కల్పించారు. పొలం గట్లు సైజులలో పెద్దగా ఉండడం ద్వారా ఎలుకలు ఆవాసం ఏర్పరచుకొని పంటకు నష్టం కలిగిస్తోందన్నారు.
గట్లను కత్తిరించే సమయంలో బురద మట్టిని గట్టుపైనే వేయడం ద్వారా పొలం గట్లపై పెరిగే వివిధ రకాల కలుపు మొక్కల ఎదుగుదలను అడ్డుకొని తద్వారా చీడపీడల బెడదను పొలంలో తగ్గించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా వరిలో గడ్డి చిలక కీటకము తనకున్న తొండం వంటి నిర్మాణాన్ని పొలం గట్టులోకి చొప్పించి గుడ్లు పెడుతుందని, గుడ్లు కీటకాలుగా మారి వరిపై ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయన్నారు. పొలం గట్లను కత్తిరించుట ద్వారా కీటకాన్ని ఆదిలోనే అదుపులో ఉంచుకోవడం ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గుతుందని సూచించారు. అదేవిధంగా రైతులు పొలాన్ని పరిశీలించు టకు శుభ్రమైన పొలం గట్లు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కొట్రంగి శ్రీనివాస్, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.