23-01-2026 12:45:20 AM
ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 22 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో అడ్డంకులు లేకుండా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురు వారం నాగోబా జాతర సందర్భంగా జిల్లాకు వచ్చిన ఆమె ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ లతో కలిసి నాగోబాను దర్శించుకున్నారు.
ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో నాగోబాకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగోబా ప్రాంగణంలోని కుమ్రం భీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంరతం ప్రజాదర్బార్లో పాల్గొన్నారు. ఆదివాసీలు చేపట్టిన నృత్య ప్రదర్శనలు, తమ సంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మంత్రి మాట్లాడుతూ గిరిజన తెగలైన కొలం, తోటి గిరిజనులకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే తోపాటు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ లు ప్రభుత్వానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. అటవీ శాఖ చట్టం ప్రకారం అధికారులు అడ్డుకుంటున్నారే తప్ప, గిరిజనుల అభివృద్ధికి అటవీ శాఖ అధికారులు అడ్డుకాదన్నారు.
జిల్లా అభివృద్ధికి నిధుల కోసం నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. మెస్రం వంశంలోని ఏడుగురికి ధూప నైవేద్యం కింద ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారా వేతనాలు ఇస్తామని మంత్రి అన్నారు.