24-04-2025 12:47:34 AM
- ప్రొఫెసర్ హరగోపాల్
యాచారం ఏప్రిల్ 23 : ఫార్మాసిటీ రద్దుచేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలనీ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు ఫార్మసిటి గ్రామాలలో పర్యటించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఇంత సుభిక్షమైన ప్రాంతాల్లో ఏదో పేరు చెప్పి కంపెనీ తెస్తామంటూ ప్రజల భూములు లాక్కొని రైతులను రోడ్డున పడేయడం అన్యాయమని అన్నారు. పటాన్ చెరువు క్యాన్సర్ మయం అయ్యిందనీ, ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో బ్రతుకుతున్న వారిని కాలుష్య కంపెనీలు పెట్టడం దారుణమన్నారు.
రాజ్యాంగాన్ని రక్షిస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు, మరి ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగం విరుద్ధంగా కోర్ట్ ఆర్డర్ ను ధిక్కరిస్తూ బలవంతంగా భూములకు పెన్సింగ్ వేయిస్తున్నారు, ఇది ఎంత వరకు సమంజసం అని అన్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి 2013లో భూసేకరణ చట్టం తెచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మా కోసం తీసుకున్న భూములు ఫ్యూచర్ సిటీకి మార్చడం చట్ట వ్యతిరేకమన్నారు. వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన విరమించుకొని భూ సేకరణ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్ రవి కన్నెగంటి, విశ్రాంత ప్రొఫెసర్ ప్రశాంత్ వనమాల, మీరా సంఘమిత్ర, అడ్వకేట్ సాజిత్, అశోక్, కొండల్ రెడ్డి, రవీంద్ర, మానవ హక్కుల వేదిక నరసింహ, జ్యోతి , శ్రీదేవి, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు , నాలుగు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
.