17-05-2025 12:00:00 AM
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
కలెక్టర్ బి.యం సంతోష్
గద్వాల, మే 16 ( విజయక్రాంతి ) : ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ధాన్యం తేమ శాతం 17% కు చేరగానే సంచుల్లో నింపి, లారీలలో వెంటనే లోడ్ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాలవారీగా గన్ని బ్యాగులు, లారీల అవసరాన్ని ముందుగా పౌర సరఫరాల జిల్లా మేనేజర్కు తెలియజేసి, సమర్థవంతమైన ప్రణాళికతో సరఫరా జరిగేలా చూడాలన్నారు.
కోనుగోలు కేంద్రాల వారీగా ధాన్యం మోతాదుతో పాటు జారీ చేసిన టోకెన్ల వివ రాలను వ్యవసాయ విస్తరణాధికారుల నుండి సేకరించి, తేమ శాతం వచ్చిన వెంటనే టోకెన్లు జారీ చేయాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
గన్ని బ్యాగులు, లారీల కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఆదేశించారు.రైస్ మిల్లుల వద్ద ధాన్యం ధాన్యం తరలింపులో జాప్యం జరుగకుండా వాహనాలను వెంటనే తరలించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేయాలి
జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి. యం సంతోష్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐ.డి.ఓ.సి. కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసం పథకం పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదా రులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని అన్నారు.
గ్రామ పంచాయతీ వారీగా లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తిచేసి, ఎంతమందికి ఇళ్లు కేటాయించారో, ఎంతమందిని అర్హులుగా గుర్తించారో, ఎంతమందిని నిరాకరించారో స్పష్టమైన జాబితా తయారు చేయాలని అధికారులను ఆదే శించారు. అర్హత లేనివారి నిరాకరణకు గల కారణాలనుకూడాజాబితాలో పేర్కొనాలని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు.రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎంపిక జరగాలని అన్నారు.
ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలోని అధికారులు,బ్యాంకర్లు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, సంబందించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.