17-05-2025 11:31:54 AM
టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు ఆవేదన
కల్లూరు,(విజయక్రాంతి): వేసవి సెలవుల్లో ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన కొన్ని విద్యాసంస్థలు అడ్మిషన్ ల పేరుతో స్కూల్ క్యాంపెయిన్ కి తిప్పుతూ ప్రైవేటు టీచర్స్ ను మనోవేదనకు, తీవ్రమైన ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ పోరం (టీపీటీఫ్) జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేసవి సెలవుల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇస్తే అడ్మిషన్ల పేరుతో, స్కూల్ క్యాంపెయిన్ పేరుతో టీచర్లను తీవ్రమైన ఎండల్లో తిప్పటం కరెక్ట్ కాదన్నారు. జీవో నెంబర్-1 ప్రకారం స్కూల్లో వచ్చే లాభాల్లో 50 శాతం ప్రైవేట్ టీచర్లకు జీత, భత్యాల రూపంలో చెల్లించాలని, అలాకాకుండా తక్కువ జీతాలతో ఎక్కువ పని చేపించి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు . మే నెల జీతభత్యాలు కూడా టీచర్స్ కు ఇవ్వాల్సి ఉన్నా కూడా మే నెల జీతం ఇవ్వడం లేదన్నారు . ట్రస్మా యాజమాన్య సంఘ విధానాలు ప్రైవేట్ టీచర్స్ కు విరుద్ధం గా నష్టం వచ్చే విధంగా ఉన్నాయన్నారు.
ప్రైవేట్ టీచర్స్ కు పీఫ్ఇయస్ఐ సౌకర్యాలు ఖచ్చితంగా ఆయా స్కూల్ యజమాన్యాలు చెల్లించాలని, మే నెల జీతం ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సెలవు దినాన్ని క్రమం తప్పకుండా అమలుపరిచి, టీచర్స్ కు వర్తింప చెయ్యాలన్నారు. విద్యాశాఖ నిబంధనలను పాటించని ప్రవేట్ స్కూల్స్ పైన జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 వరకు ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని, నూతన విద్యా సంవత్సరానికి ఆయా స్కూల్స్ యాజమాన్యాలు గుర్తింపు తెచ్చుకోవాలని డిమాండ్ చేశారు. జూన్ 12 స్కూల్ పున: ప్రారంభంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరo జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రస్మా నాయకులను కలిసి టీచర్స్ డిమాండ్ల మీద వినతి పత్రం ఇస్తామన్నారు.