17-05-2025 11:17:15 AM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దోహాలో వేదికగా ప్రారంభమైన డైమండ్ లీగ్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త రికార్డును నెలకొల్పాడు. తన కెరీర్లో తొలిసారిగా నీరజ్ చోప్రా 90.23 మీటర్లు త్రో మార్కును అందుకున్నారు. భారత గోల్డెన్ బాయ్ తన మునుపటి జాతీయ రికార్డు 89.94 మీటర్లను అధిగమించాడు. అయితే, దోహా డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా రెండవ స్థానాన్ని మాత్రమే దక్కించుకున్నాడు. జర్మనీకి చెందిన అథ్లెట్ జూలియన్ వెబర్ అద్భుతంగా 91.06 మీటర్లు విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నీరజ్ చోప్రా తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో విస్తృత ప్రశంసలు కురుస్తున్నాయి.
అనేక అభినందన సందేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్ (గతంలో ట్విట్టర్)లో నీరజ్ చోప్రాకు తన ప్రశంసలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... “అద్భుతమైన ఘనత! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచికి నిదర్శనం. భారతదేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది.” అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా నీరజ్ ను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు.