23-01-2026 12:00:00 AM
బీసీ హక్కులకు విజయం
కాళేశ్వరం, జనవరి 22 (విజయక్రాంతి):కాళేశ్వరం గ్రామానికి చెందిన వెన్నపు రెడ్డి మోహన్ రెడ్డి నకిలీగా బీసీ గాండ్ల కుల ధ్రువీకరణ పత్రం పొందిన అంశంపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్ట్ పరిశీలించి న్యాయం చేయడం హర్షణీయమని కాళేశ్వరం బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు అడప సమ్మయ్య అన్నారు. కాళేశ్వరం హరిత హోటల్ లో ఈ సందర్భంగా మాట్లాడుతు రాజ్యాంగ విలువలను కాపాడుతూ, నిజమైన బీసీ వర్గాల హక్కులను పరిరక్షించిన గౌరవనీయులైన తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తులకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే ఈ కేసులో వాస్తవాలను గుర్తించి లిఖితపూర్వకంగా నివేదికలు అందించిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్, తాసిల్దార్ల పాత్రను ప్రత్యేకంగా గుర్తు చేశారు.తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన స్పష్టమైన సూచనల మేరకు, బీసీ కమిషన్ మరియు తాసిల్దార్ లేఖల ఆధారంగా నకిలీ బీసీ గాండ్ల కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికైన వెన్నపు రెడ్డి మోహన్ రెడ్డి ఎన్నికను జిల్లా కలెక్టర్ తక్షణమే రద్దు చేసి నిజమైన బీసీ వర్గాలకు న్యాయం చేయాలని వారు బలంగా డిమాండ్ చేశారు.
నకిలీ కుల ధ్రువీకరణల కారణంగా నిజమైన బీసీ కుటుంబాలు రాజకీయంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే బీసీలకు జరుగుతున్న అన్యాయం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. బీసీ వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాళేశ్వరం బీసీ ఐక్య వేదిక గౌరవ సలహాదారులు మెంగాని అశోక్,ఉపాధ్యక్షులు గోర దేవయ్య,మాచర్ల కిరణ్,కార్యదర్శి దుది శ్రీనివాస్, కంకణాల బాపు,బొల్లం సురేష్, వార్డు లు ఇమ్రాన్, శేఖర్ తదితర నాయకులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సడవలి ఉన్నారు