14-11-2025 12:00:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, నవంబర్ 13 : జిల్లాలో చేపడుతున్న వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సర్వే ప్రక్రియలను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ గణప సముద్రం రిజర్వాయర్ కోసం భూసేకరణ లో భాగంగా పెండింగ్ లో ఉన్న 197 ఎకరాలకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే ఈ నెల 30వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా అవార్డు పూర్తయిన 28 ఎకరాలకు పరిహారం చెల్లించే ప్రక్రియ పూర్తి చేయాలని, అదేవిధంగా ఇంకా పెండింగ్ లో ఉన్న భూసేకరణకు సర్వే ఈనెల చివరిలోపు పూర్తి చేయాలన్నారు.
సవాయిగూడెం గ్రామం లో ఖాన్ చెరువు ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు కాలువ నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే రెండు నెలల్లో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా కేశంపేట, దత్తాయిపల్లి, సవాయిగూడెం గ్రామాల పరిధిలో సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు.
బుద్ధారం రిజర్వాయర్ కు సంబంధించి 97 ఎకరాల పీ ఎన్ ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే ఏడి బాలకృష్ణ, ఇతర రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.