01-12-2025 10:10:49 PM
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం..
గంభీరావుపేట (విజయక్రాంతి): జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న జరగబోయే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించి, అర్హులైన జర్నలిస్టులకు గృహస్థలాలు మంజూరు చేయాలన్నారు.
సంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ధర్నా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పాపగారి యాదగిరిగౌడ్, ఎర్ర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అర్జున్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరిగే రమేష్, సంయుక్త కార్యదర్శి పల్లె శ్రీనివాస్, కోశాధికారి సిరిపురం ఆంజనేయులు, సభ్యులు సంతోష్ చారి, షబ్బీర్, బొంగు మల్లేశం, గుడికాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.