16-07-2025 12:59:04 AM
-బీసీ,ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహరాజ్
-మన భూమి రథయాత్రలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆదిలాబాద్, జూలై 15 (విజయక్రాంతి ) : ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలల పాటు చేపట్టిన మా భూమి రథయాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలు దారుణంగా కనిపించాయని ఆ సమస్యలను పరిష్కరించాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు.
లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. అధికారులు అందు బాటులో లేకపోవడం ద్వారా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో నరేందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలోని 15 మండలాలను తిరుగుతూ అనేక రకాల సమస్యలను గమనించామని, ఆ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విన్నవించారని పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారాలు అందించలేదని, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గ్రామాలు ఉన్నాయన్నారు. అనేక సమస్యలు జిల్లా కలెక్టర్ కు విన్నవించమని, వాటిని 30 రోజుల్లో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ,ఎస్టీ,ఎస్టీ జేఏసీ నాయకులు ఉదారి నారాయణ, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు దర్శనాల సుష్మ, ఏనుగు శ్యామల, మంజూష గంగామణి, వివిధ మండల నాయకులు తదితరులు ఉన్నారు..