12-12-2025 12:00:00 AM
గ్రేటర్లో దోమల నివారణ కోసం ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.. 2020 సంవత్సరంలో రూ.25 కోట్లు, 2021 సంవత్సరంలో రూ.25 కోట్లు, 2022 రూ.30కోట్లు, ప్రస్తుత బడ్జెట్లో ఇంకా ఎక్కువ ఖర్చు చేశారన్నది అంచనా. అయితే ఇవి కేవలం అంకెలకు మాత్రమే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలర్లు, టైర్లు. తాగి పడేసిన కొబ్బరి బొండాల్లో నీరు చేరడం, చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉంటున్నాయి.
కానీ, ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దోమల నివారణకు నాలుగేళ్ల కిందట జోన్ కు రెండు చొప్పున 12 మస్కిటో ట్రాఫిక్ మిషన్లు కొన్నా ఆపరేట్ చేయకపోవడంతో అవి మూలన పడ్డాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 134 చెరువులు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదు. దోమల బెడద పెరిగిపోవడంతో జీహెచ్ఎంసీ పరిధిలో వైరల్ ఫీవర్లు, డెంగ్యూ కేసులు ఎక్కువైపోయాయి. దోమలు కుట్టడం వల్ల చిన్నపిల్లల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం జీహెఎంసీ పరిధిలో మొత్తం 300 ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి.డివిజన్ కు రెండు యంత్రాలు కేటాయించారు. పెద్ద మిషన్లు 60 ఉన్నాయి. యంత్రాలు వాడడానికి పెట్రోల్, డీజిల్ నింపుతారు. ఫాగింగ్ మెషిన్లు వాడకపోగా ఇందులో వాడినట్లు చూపి కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు స్పందించాలి. దోమలు ఒక్కసారి వృద్ధిలోకి వచ్చాక ఎంత పొగింగ్ చేసినా దోమలు చనిపోయే అవకాశం తక్కువ.
గంబుసియా( మస్కిటో చేపలు) ఎక్కువగా పశ్చిమ అమెరికా ప్రాంతాల్లో లభ్యమవుతాయి వీటికి ఆహారం దోమల లార్వా, కొన్ని రాష్ట్రాల్లో వీటిని దిగుమతి చేసుకొని ఇప్పటికీ వాడటం జరుగుతుంది. ఈ గంబుసియా చేపలను దిగుమతి చేసుకొని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ చెరువుల్లో వదిలినట్లయితే మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలు తప్పించుకునే అవకాశం ఉంటుంది.
- బండి సాగర్ రెడ్డి, మల్కాజ్గిరి