calender_icon.png 22 June, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి ఆదివాసులే మూలం

21-06-2025 09:13:35 PM

కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోటియా నాయక్...

సూర్యాపేట (విజయక్రాంతి): భారతదేశానికి ఆదివాసులే మూల వాసులు అని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోటియా నాయక్ భూక్యా(Congress Party ST Cell State Coordinator Kotia Naik Bhukya), మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్ లు అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలోని రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి వసతి గృహం (రెడ్డి హాస్టల్) లో నిర్వహించే ఆదివాసుల శిక్షణ శిబిరంను విజయవంతం చేయాలని వారు కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదివాసులకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, అందించిన ఫలాలు అందాలంటే ఆదివాసీలు ఐక్యంగా ఉండాలన్నారు.

భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన ప్రయోజనాలను వారికి దక్కకుండా బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పట్టాలు ఇచ్చిన విధంగా నేటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంబాడీలు(బంజారా), కోయ, గోండు, చెంచులు, ఎరుకల వారిపట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతుందన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఆదివాసుల హక్కులపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్, ట్రైకార్ కార్పొరేషన్ తేజావత్ ఎల్లయ్య నాయక్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గిరిజన నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూల నుండి ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లూనావత్ పాండు నాయక్, మాజీ జెడ్పిటిసి జాటోత్ రాజేష్ నాయక్, మాజీ ఎంపీటీసీలు నాగు నాయక్, నాగమణి చత్రు నాయక్, మాజీ కౌన్సిల్ కమల చంద్రు నాయక్, నాగు నాయక్, లచ్చ వెంకన్న నాయక్, సోమ్లా నాయక్, మహేందర్ నాయక్ పాల్గొన్నారు.