02-11-2025 10:20:07 PM
- ఆకలి తీర్చుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళిన విద్యార్థులు
- జిన్నారం గురుకుల విద్యార్థుల దీనస్థితి
జిన్నారం: కడుపునిండా తిండిలేకుండా గురుకుల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి సుమారు 40 మంది విద్యార్థులు రోడ్డు బాట పట్టారు. జిన్నారం పట్టణ శివారులోని గురుకుల పాఠశాలలో గత పది రోజులుగా అన్నం మెత్తగా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బియ్యం పాఠశాలకు రావడంతో ఈ సమస్య ఏర్పడిందన్నారు. అన్నం మెత్తగా ఉంటుండడంతో సగం కడుపుకు అన్నం తింటున్నామని విద్యార్థులు తమ బాధను వివరించారు. శనివారం రాత్రి సుమారు ముప్పై నుంచి నలబై వరకు విద్యార్థులు జిన్నారంలో ఏదైనా తినేందుకు పెద్దమ్మగూడెం మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా గ్రామస్తులు పలువురు ఆపి అడగడంతో విషయం వివరించారు. అయినప్పటికీ చీకట్లో జిన్నారం వెళ్లకుండా తిరిగి హాస్టల్ కు వెళ్లాలని గ్రామస్తులు విద్యార్థులను పంపించారు.