calender_icon.png 10 December, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ ప్రతిష్టకు భంగం!

08-12-2025 12:00:00 AM

-శాసనసభ నిబంధనలకు విరుద్ధం

-హౌస్ కమిటీల ఊసేలేదు

-డిప్యూటీ స్పీకర్ నియామకం ఏదీ..

-ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు

-రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు

-స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ 

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి) : తెలంగాణ శాసన సభ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, భంగం కలిగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు.

శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడం పట్ల హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సభను నిర్వహిం చాల్సి ఉన్నా, అది జరగడం లేదని పేర్కొన్నా రు. అలాగే, సరైన కారణాలు లేకుండా సభను తరచుగా, హఠాత్తుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్ 13 తోపాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్ 16 లకు విరుద్ధమని తెలిపారు.

సభలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధం గా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలను పాటించడం లేదని అన్నారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఒక ప్రశ్నకు సంబంధించి లోతుగా చర్చించేందుకు, ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరించడం, కుదించ డం రూల్ 50 ప్రధాన ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. ప్రజాసమస్యలను తక్షణమే ప్రస్తావించే జీరో అవర్‌ను కూడా ప్రతిసారి కుదించడం సభా హక్కులను దెబ్బతీయడమేనని స్పష్టంచేశారు. 

అన్ స్టార్డ్ ప్రశ్నల కు సమాధానాలు ఇవ్వకపోవడం.. రూల్ 39 ప్రకారం వీటికి లిఖితపూర్వక సమాధానాలు సభలో ప్రవేశపెట్టాలి.. అలాగే రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు ఆ సమాధానాలు అందజేయాలి.. కానీ ఈ నిబంధనలను పాటించకపోవడం వల్ల సభ జవాబు దారీతనం లోపించిందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

హౌస్ కమిటీల ఊసేలేదు

గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీల ను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని హరీశ్ రావు తెలిపారు. అసెంబ్లీ నిబంధ నల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని చేయడం లేదన్నారు.అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమిటీల పనిమాత్రం ఆగ కూడదని రూల్ 227 స్పష్టంగా చెబుతోందని, కానీ అసలు కమిటీలే లేకపోవడం వల్ల ప్రభు త్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయింద ని ఆయన తెలిపారు.

ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. కమిటీల పని ఎప్పుడూ ఆగకూడదని, సమావేశాలకు సరిపడా సభ్యులు ఉండాలని రూల్స్ 199, 201 చెబుతున్నా.. వీటిని పట్టించుకోకపోవడం వల్ల కమిటీల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డిప్యూటీ స్పీ కర్ నియామకం జరగకపోవడం మరో ప్రధా న ఉల్లంఘన. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలే జ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఫలితంగా, సభ్యుల హక్కుల ఉల్లంఘ నకు సంబంధించి అనేక ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయని, ఇది రూల్ 256, 257లకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలేవి?

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు- 1986, రూల్స్ 3 నుంచి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీచేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయం.

ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే నని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హరీశ్‌రావు డిమాండ్లు ఇవీ..

- ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి.

- పశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.

- అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి.

- అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి.

- డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.

- ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి.

- సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలి.

-పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టంతోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి.