04-11-2025 12:00:00 AM
							-కొల్చారం ఎంపీవో అనుచిత వ్యాఖ్యలు
-ఎంపీవోపై ఆగ్రహించిన కోనాపూర్ ప్రజలు
-అందుబాటులో లేని పంచాయతీ కార్యదర్శి
కొల్చారం, నవంబర్ 3 (విజయక్రాంతి) : ‘కోనాపూర్ గ్రామస్తులు గాడిదలు.. వాటిని మేపడానికే నేను గ్రామానికి వచ్చా’ అని అంటూ కొల్చారం ఎంపీఓ కృష్ణవేణి ప్రజలపై ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీకు బాధ్యత లేదా అధికారివై ఉండి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతావా.. ఇదేనా మీ పని తీరు? మా సమస్యలు పరిష్కరించమంటే మమ్మల్ని గాడిదలంటావా’ అని గ్రామస్తులు ఎంపీఓను నిలదీశారు.
ఈ సంఘటన సోమవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్లో జరిగింది. పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారుల నిర్లక్ష్యం మూలంగా పారిశుధ్య సమస్యతో కోనాపూర్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శి గ్రామానికి రావడం లేదు. పారిశుధ్య కార్మికులు కూడా పనిచేయడం లేదు. గ్రా మంలో మురుగు కాలువలు చెత్తతో నిండిపోయి, రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ఇళ్లలోకి వస్తోంది.
దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు పారిశుధ్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం ప్రజలు పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. విషయం తెలిసిన ఎంపీడీవో రఫీక్ ఉన్నిసా బేగం గ్రామానికెళ్లి, సమస్యను పరిష్కరించాలని ఎంపీఓ కృష్ణవేణిని ఆదేశించారు. దీం తో గ్రామానికి ఎంపీఓ కృష్ణవేణి వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. అప్పటికీ పంచాయతీ కార్యాలయాన్ని సిబ్బంది కానీ పంచాయతీ సెక్రెటరీ గానీ తెరవలేదు.
పంచాయతీ కార్యదర్శి మహేష్ గ్రామస్తులకు గానీ అధికారులకు గానీ ఫోన్లో అందు బాటులో లేడు. ఎవరికీ అందుబాటులో లేని కార్యదర్శితో ఎలా పని చేయిస్తారని ప్రజలు ఎంపీఓను నిలదీయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్రామస్తులు గాడిదలు. వాటిని మేపడానికి నేను గ్రామానికి వచ్చా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రజలు ఎంపీఓపై తిరగబడ్డారు. సంగాయిపేట, తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శులు సదాశివుడు, ప్రశాంత్ జోక్యం చేసుకొని గ్రామస్తులను శాంతింపజేయండతో వారు ఆందోళన విరమించారు.
వారం రోజుల్లో గ్రామంలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఎంపీఓ కృష్ణవేణి, కార్యదర్శులు గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సహకార సంఘం ఉపాధ్యక్షుడు మోత్కు మల్లేశం, మాజీ సర్పంచ్ రమేష్, బీఆర్ఎస్ నాయకుడు బండి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.