ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు
బిజెపి మేడ్చల్ ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి..
మేడిపల్లి (విజయక్రాంతి): రహదారుల వెడల్పు పేరుతో హిందూ దేవాలయాల జోలికి వచ్చిన, వాటిని తొలగించే ప్రయత్నం చేసిన, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బిజెపి మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఉప్పల్ నారపల్లి రహదారి విస్తరణలో భాగంగా పీర్జాదిగూడ బండి గార్డెన్ సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయాన్ని తొలగించేందుకు ఆర్ అండ్ బి అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం బిజెపి కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రహదారుల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు పంపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో విస్తరణ పనులు సరిగా జరగడం లేదని ఆరోపించారు. ఫ్లై ఓవర్ పనులు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ కోసం హిందూ మందిరాలను తొలగించేందుకు పూనుకుంటున్నారని ఆరోపించారు. నారపల్లి సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలు ఉన్నాయని దమ్ముంటే వాటిని తొలగించి చూడాలని సవాల్ విసిరారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న బంగారు మైసమ్మ ఆలయ జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.






