11-08-2025 01:13:08 AM
వర్షాకాలం వచ్చిందంటే ఇదే తంతు!
అరచేతుల్లో ప్రజల ప్రాణాలు పెట్టుకోవలసిన దుస్థితి
అలంపూర్,ఆగస్టు 10:వర్షాకాలం వచ్చిందంటే చాలు అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలు జలమయంగా మారి ప్రమాద భరితంగా మారుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసే భారీ వర్షాలు కారణంగా సమీపంలోని పంట పొలాలు,రోడ్లమీద వర్షపు ఉన్న నీరంతా లోతట్టు ప్రాంతంగా ఉన్న బ్రిడ్జి లోపలికి చేరి జలమయంగా మారుతుంది. అయితే ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ప్రధాన కేంద్ర బిందువుగా ఈ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలే దిక్కుగా మారుతున్నాయి.
అట్టి బ్రిడ్జిలలో వరద నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు తీవ్ర అంతరాయంగా ఏర్పడుతుంది. ఈ వర్షం ఇలానే రెండు, మూడు రోజులపాటు కొనసాగితే ఈ దారి గుండా ప్రయాణాలు అమాంతం నిలిచిపోతాయి. ఒకవేళ గ్రామాల్లో అత్యవసర సమయాలలో ప్రజలు అనారోగ్యాన బారిన పడితే రోడ్డు మెరుగైన వైద్య చికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.
అలా వెళ్లే క్రమంలో సకాలంలో రోడ్డు దుస్థితి వల్ల హాస్పిటల్ కి చేరుకోలేక మధ్యలోనే ప్రాణాలు గాల్లో దీపం లెక్క పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపైన సంబంధిత రైల్వే అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని వేడుకుంటున్నారు.
ఇలా జిల్లా వ్యాప్తంగా వల్లూరు, నారాయణపురం, మానవపాడు మండలాల్లో ఈ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు రైల్వే శాఖ అధికారులు నిర్మించారు.వాటి నిర్వహణలో రైల్వే శాఖ, ప్రభుత్వ అధికారుల వైఫల్యం స్పష్టమవుతుంది.అధికారులు చర్యలు చేపట్టి ప్రజల పక్షాన ఆలోచించాలని కోరుతున్నారు.