27-09-2025 02:36:29 PM
ఎల్లాపూర్ బ్రిడ్జ్ పైనుంచి నీరు ప్రవహించడంతో మెదక్ కు స్తంభించిన రాకపోకలు
విజయక్రాంతి, పాపన్నపేట: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ(Sri Edupayala Vana Durga Bhavani Devalayam) చెంత గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్న సంగతి తెలిసిందే. సింగూరు నుంచి దిగువకు నీటిని వదలడంతో పాటు ఎగువన భారీ వర్షాలు కురవడంతో మంజీరా లో నీటి ప్రవాహం ఉదృతంగా పెరిగింది. దీంతో వన దుర్గమ్మ ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మధ్యలో కొంతమేర ప్రవాహం తగ్గినా మళ్లీ వర్షాలు కురవడంతో నీటి ప్రవాహం పెరిగింది.
మెదక్ కు స్తంభించిన రాకపోకలు
మంజీరా లో నీటి ప్రవాహం ఉదృతంగా పెరగడంతో ఎల్లాపూర్ బ్రిడ్జ్ పైనుంచి నీరు ప్రవహిస్తుంది. దీంతో మెదక్ వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ మెదక్ కు వాహనదారులు వెళ్ళకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.