24-06-2025 09:59:02 PM
24 గంటల్లో ఏటీఎం దొంగల పట్టివేత..
రెండు బైకులు, గ్యాస్ సిలిండర్ గ్యాస్ కట్టర్ స్వాధీనం..
రూ.30 వేల విలువైన ఏటీఎం క్యాసెట్ చోరీ
వివరాలు వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్
దొంగలను పట్టుకున్న పోలీసులకీ ప్రశంసలు, క్యాష్ రివార్డ్
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): నేరాలు, దొంగతనాలు జరగడం సహజమే.. కానీ వాటిని ఇట్టే చేదించి కరుడుగట్టిన దొంగలను పట్టుకోవడంలో బెల్లంపల్లి పోలీసులకి మించిన వారు లేరు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 24 గంటల్లోనే ఏటీఎం చోరీకి యత్నించిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకునీ బెల్లంపల్లి పోలీసులు తమ సత్తాఏమిటో చాటుకున్నారు. వివరాలను మంగళవారం బెల్లంపల్లి సీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్(DCP Bhaskar) వెల్లడించారు. బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రైల్వే స్టేషన్ వైపుగా ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో ఈనెల 23న తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏటీఎం గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దొంగతనానికి యత్నించింది. ఇందులో మహమ్మద్ ముస్తఫా, షాహిద్ లను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు.
వీరిని బెల్లంపల్లిలోని కెమికల్ ఏరియాలో పోలీసులు పట్టుకున్నట్లు డిసిపి వెల్లడించారు. ఐదుగురు సభ్యుల హర్యానా దొంగల ముఠా రెండు బైకులతో గ్యాస్ సిలిండర్ గ్యాస్ కట్టర్ తో బెల్లంపల్లికి వచ్చింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం రెక్కిచేసి నిర్మానుషంగా ఉన్న బెల్లంపల్లి కాల్ టాక్స్ ఏటీఎం ను దొంగతనానికి ఎంచుకున్నారు. వేసుకున్న స్కెచ్ ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఏటీఎం ను షట్టర్ ఓపెన్ చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం బాక్స్ ను కట్ చేస్తున్నారు. ఇదే సమయంలో పెట్రోల్ టీం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్, సాయి కృష్ణ, హోంగార్డు సంపత్ అటుగా సైరన్ తో వెళ్ళింది. అది గమనించిన దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయారు.
పారిపోతూ ఏటీఎం క్యాసెట్ ను కూడా ఎత్తుకెళ్లారు. దాని విలువ 30 వేల వరకు ఉంటుంది. ఏటీఎం షట్టర్ సగం తెరిచి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లిన చూశారు. ఏటీఎం బాక్స్ కట్ చేసి ఉంది. దొంగల ముఠా వదిలినా గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్, రెండు బైకులు, కారం పొడి ప్యాకెట్లు ఏటీఎం వద్ద లభించాయి. ఈ సమాచారం మేరకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అప్రమత్తమై బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దిన్, టూ టౌన్ ఎస్ఐ మహేందర్, నెన్నల ఎస్ఐ ప్రసాద్, నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దొంగల ముఠా కోసం గాలింపు చేపట్టారు.
చోరీ చేసిన బైక్ లతోటే ఏటీఎం దొంగతనానికి యత్నం..
ఏటీఎం దొంగతనానికి ముందుగానే దొంగల ముఠా మహారాష్ట్రకు చెందిన పల్సర్ బైక్, మంచిర్యాలలో మరో బైకును దొంగలించారు. కాగజ్ నగర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ గ్యాస్ కట్టర్ అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశారు. ఏటీఎం దొంగతనoలో అరెస్ట్ అయినా మహమ్మద్ ముస్తఫా, షాహిద్ జెసిబి ఆపరేటర్స్ గా పనిచేస్తున్నారు. తక్కువ సమయంలోనే లక్షల రూపాయలు సంపాదించాలని అత్యాశతో వారి సహచరు నేరస్తులు అలీమ్ ఖాన్, సాజిద్, అప్తాబ్ లతో ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బెల్లంపల్లిలో ఈ ముఠా ఏటీఎం దొంగతనానికి విపులయత్నం చేసింది. పరారీలో ఉన్న అలీమ్ ఖాన్, సాజిద్, అప్తాబ్ పట్టుకోడానికి ప్రత్యేక బలగాలు వేటాడుతున్నాయని డిసిపి భాస్కర్ వివరించారు.
దొంగలను పట్టుకున్న పోలీసులకు క్యాష్ రివార్డ్
బెల్లంపల్లిలో సంచలన సృష్టించిన ఏటీఎం దొంగతనం కేసులో హర్యానా దొంగల ముఠా సభ్యుల ఇద్దరినీ పట్టుకోవడంలో ఎంతో సాహసం, చాకచక్యత కనబరిచిన పోలీసులను డీసీపీ భాస్కర్ అభినందించాడు. నెన్నల ఎస్సై ప్రసాద్, కానిస్టేబుల్ రవీందర్, సాయి కృష్ణ, హోంగార్డు ఎలుక పల్లి సంపత్ ను ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డును డీసీపీ అందజేశారు. దొంగతనం జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించి ఎస్బిఐ ఏటీఎంలో ఉన్న రూ. మూడు లక్షల 50 వేల నగదును కాపాడినందుకు పెట్రోలింగ్ టీంను ప్రత్యేకంగా అభినందించారు.
ఏటీఎంలకీ సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసుకోవాలి
నిర్మానుషంగా, జనసంచారానికి దూరంగా ఉన్న ఏటీఎంలకు ఎస్బిఐ శాఖ ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంక్ శాఖ అధికారులకు సూచించారు. సి ఎం ఎస్ కంపెనీకి చెందిన అసిస్టెంట్ మేనేజర్ ఏటీఎం చోరీ ఘటన పై టూ టౌన్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరు దొంగలను కోర్టులో రిమాండ్ చేశారు. టూ టౌన్ ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దిన్, టూ టౌన్ ఎస్సై మహేందర్, తాళ్ల గురజాల ఎస్సై రమేష్, నేన్నల ఎస్సై ప్రసాద్, కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.