24-09-2025 12:21:24 AM
-కేవలం చిన్న పిల్లలకే అంటూ షాపు యజమాని ప్రకటన
-ఎగబడ్డ జనం
మహబూబాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): దసరా, దీపావళి పండగలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ రెడీ మెడ్ దుస్తుల షాపు యజమాని చిన్నపిల్లలకు కేవలం 5 రూపాయలకే 2 టీ షర్టులు ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు. దీంతో మంగళవారం ఒక్కసారిగా జనం షాపు వద్ద ఆఫర్ టీ షర్టుల కోసం ఎగబడ్డారు. జనం ఎక్కువ కావడంతో ఆ ప్రాంతం రద్దీతో నిండిపోయింది. కొందరు మహిళలు అయితే ఏకంగా చిన్నపిల్లల్ని వెంట పెట్టుకొని మరీ వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు.
మంగళవారం షాప్ కొత్తగా ప్రారంభిస్తున్న సందర్భంగా ఐదు రూపాయల కు రెండు టీ షర్టుల ఆఫర్ పెట్టామని, అలాగే 9 నుంచి 99 రూపాయల వరకు చిన్నపిల్లలకు అవసరమైన రెడీమేడ్ దుస్తులు లభిస్తాయని హోర్డింగ్ పెట్టారు. ఏది ఏమైనా షాప్ ఓపెనింగ్ సందర్భంగా పబ్లిసిటీ కోసం షాపు యజమాని పెట్టిన ఆఫర్ కోసం జనం ఎగబడ్డారు.