06-12-2025 10:49:29 PM
•కొత్తగా ఏర్పడిన సంతోష్ నగర్ రికార్డు
•ఏకగ్రీవ స్ఫూర్తిని నింపిన 'ఖాతా'
•మహిళా శక్తికి పట్టం కట్టిన గ్రామస్తులు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఏర్పడిన సంతోష్ నగర్ గ్రామ పంచాయతీ చరిత్ర సృష్టించింది.గట్లమల్యాల హామ్లెట్ గ్రామమైన సంతోష్ నగర్ తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఎస్టీ జనరల్ రిజర్వ్ అయిన ఈ స్థానానికి ఒకరి నామినేషన్ ఉపసంహరణతో బానోతు సరోజన–కిషన్ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఆరు వార్డులకు గాను, ఒకటో వార్డు కూడా ఏకగ్రీవమైంది. మండల పరిధిలోని ఖాతా గ్రామం ఏకగ్రీవ స్ఫూర్తిని నింపింది.
ఇక్కడ ఎస్సీ ఉమెన్ రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానానికి పుల్లూరి సోనీ మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో మొత్తం 8 వార్డులకు గాను, ఏకంగా 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. గట్లమల్యాల క్లస్టర్ రిటర్నింగ్ అధికారి అంజలి తెలిపారు. ఈ ఏకగ్రీవమైన రెండు సర్పంచ్ స్థానాలకు మహిళలే ఎన్నిక కావడం విశేషం. మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను, రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగతా 23 గ్రామ పంచాయతీలకు 86 మంది బరిలో ఉన్నారు.220 వార్డు స్థానాలకు 40 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, 483 బరిలో ఉన్నారు.