23-08-2025 07:57:17 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య అన్నారు. జిల్లా వయోజన విద్య కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ లో జిల్లాలోని ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, డీఈఓ ఎస్.యాదయ్యలతో కలిసి మాట్లాడారు. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, నిరక్షరాస్యతను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు.
ఇందు కోసమే వయోజనులైన ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉల్లాస్- నవభారత్ సాక్షరత కార్యక్రమం ద్వారా 15 సంవత్సరాలు, ఆపైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారికి ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతో పాటు కీలక జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత అందించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని మండల స్థాయిలో విజయవంతం చేసే విధంగా మండల విద్యాధికారులు సమన్వయంతో కృషి కోరారు.