09-07-2025 12:00:00 AM
హైద రాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో సీట్లు నిండలేదు. భారీగా సీట్లు మిగిలిపోయాయి. రెసిడెన్షియల్ స్కూళ్లకు ఉన్నంత డిమాండ్ డిగ్రీ కాలేజీలకు ఉండడంలేదు. పైగా డిగ్రీ కోర్సుల్లో పెద్దగా చేరే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు (టీఎస్ డబ్ల్యూఆర్డీసీ) 28, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు (టీటీడబ్ల్యూఆర్డీసీ) 22, తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు (టీబీసీడబ్ల్యూఆర్డీసీ) 29 కాలేజీలున్నాయి.
అయితే ఈ కాలేజీల్లో సీట్లు 40 శాతం కూడా నిండలేదు. మూడు విడుతల దోస్త్ అడ్మిషన్లు కలుపుకొని జూలై 5 వరకు ఉన్న వివరాల ప్రకారం టీఎస్డబ్లూఆర్డీసీ 28 కాలేజీల్లో 8,060 సీట్లకు 4,156 సీట్లు మాత్రమే నిండాయి. టీటీడబ్ల్యూఆర్డీసీ 22 కాలేజీల్లో 5,520 సీట్లకుగానూ 2,919 మంది విద్యార్థులు చేరారు. టీబీసీడబ్ల్యూఆర్డీసీ 29 కాలేజీల్లో 9,774 సీట్లలో 2,101 సీట్లు మాత్రమే నిండాయి. మొత్తంగా 79 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 23,354 సీట్లుంటే అం దులో మూడు విడుతలు దోస్త్ అడ్మిషన్లు ముగిసే వరకు కేవలం 9,176 (39.3 శాతం) మాత్రమే నిండడం గమనార్హం.
2024 ఏడాదిలో మొత్తం 79 డిగ్రీ కాలేజీల్లో 23,574 సీట్లుండగా, అందులో 8,693 (36.8శాతం) నిండితే, ఇక 2023 24లో 9 వేల అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ 2025 విద్యాసంవత్సరం కూడా 9,176 అడ్మిషన్లే నమోదయ్యాయి. అంతేకాకుండా 58 నాన్ దోస్త్, మైనారిటీ కాలేజీ ల్లోని 36,637 సీట్లకు 11,702 సీట్లు భర్తీ అయ్యాయి.
ఈ సారి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, నాన్ దోస్త్ 957 కాలేజీలన్నింటిలో 4,36,947 సీట్లకు గానూ 1,41,590 సీట్లు నిండాయి. సీట్లు భారీగా మిగలడంతో మరో ఒకట్రెండు విడుతల్లో అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
మేనేజ్మెంట్ కాలేజీలు సీట్లు చేరినవారు
టీఎస్డబ్లూఆర్డీసీ 28 8060 4156
టీటీడబ్ల్యూఆర్డీసీ 22 5520 2919
టీబీసీడబ్ల్యూఆర్డీసీ 29 9774 2101
మొత్తం 79 23,354 9176