calender_icon.png 5 June, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

60 డివిజన్లుగా రామగుండం బల్దియా

03-06-2025 06:13:40 PM

పెరగనున్న విస్తీర్ణం, జనాభా

మారనున్న కార్పొరేషన్ స్వరూపం..

ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ..

డివిజన్ లో ఇప్పటినుంచి తిరగాలని పార్టీ క్యాడర్ కు రామగుండం ఎమ్మెల్యే సంకేతాలు..

పెదపల్లి (విజయక్రాంతి): ప్రస్తుతం 50 డివిజన్లుగా ఉన్న రామగుండం నగర పాలక సంస్థ(Ramagundam Municipal Corporation) 60 డివిజన్ లతో పునర్విభజన జరుగుతుంది. చుట్టు ప్రక్కల గ్రామాల విలీనంతో జనాభా, విస్తీర్ణం పెరగనుంది. దీనిలో భాగంగా నూతన ఓటరు జాబితా తయారు చేయడంలో నగర పాలక సంస్థ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం వార్డు ఆఫీసర్లతో కసరత్తును వేగవంతం చేశారు. ఆర్.ఓ ఆంజనేయులు, ఆర్.ఐ. శంకర్ రావు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరి, అధికారులు నూతన ఓటరు జాబితా తయారు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. చుట్టు ప్రక్కల గ్రామాల విలీనంతో పెరగనున్న జనాభాను జల్లెడ పట్టి ఒక్కో డివిజన్లో 3వేల నుంచి 3,100 మంది ఓటర్లు ఉండేలా పునర్విభజన చేస్తున్నారు.

నూతన  ఓటరు జాబితాను టౌన్ ప్లానింగ్ అధికారులు మరోసారి పరిశీలించి చివరకు ప్రభుత్వంకు పంపించనున్నారు. ఆపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా, 1982లో నోటిఫైడ్ ఏరియా నుంచి పురపాలక సంఘంగా ఉన్న రామగుండం 2014 డిసెంబర్లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ యైటింక్లయిన్ కాలనీ, గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం, ఫర్టిలైజర్సిటీ ప్రాంతాలు కలిసి 50 డివిజన్లుగా ఉన్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం 2,29,644 జనాభా ఉండగా, ప్రస్తుతం 2.80 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కార్పొరేషన్లో సుమారు 50వేల నివాస గృహాలు ఉన్నాయి. అంతర్గాం మండలం లింగాపూర్, రామగుండం అక్బర్ నగర్, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్, రామగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి ప్రజల నుంచి విముఖత వ్యక్తమైనా... పునర్విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. దీంతో 93.87 చ.కి.మీ వైశాల్యంలో ఉన్న రామగుండం కార్పొరేషన్ స్వరూపం మారి 100చ.కి.మీ వరకు పెరగనుంది.

ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ

60 డివిజన్లుగా కొత్త ఓటరు లిస్టు తయాలో అధికారులు తలమునకలు కాగా, ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ మొదలైంది. తమ డివిజన్ పరిధిలోకి ఏఏ ప్రాంతాలు వస్తాయోనని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. డివిజన్లో రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలకు కొంత గడువు ఇచ్చి ఆ పిదప గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇదిలా ఉండగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచి డివిజన్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రచారం చేసుకోవాలని, తానే స్వయంగా సర్వే నిర్వహించి ఎవరైతే గెలుస్తారన్న ధీమా కలుగుతుందో వారికే పార్టీ నుంచి టికెట్లు వస్తాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ పార్టీ క్యాడర్ కు సంకేతాలు పంపినట్లు తెలిసింది.