03-06-2025 05:55:43 PM
సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి...
ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
మహబూబాబాద్ (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి(Former MLA Vem Narender Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఆరు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయించిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీలు రవిచంద్ర, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కేసముద్రంతో పాటు ఇనుగుర్తి మండల అభివృద్ధికి చేయూతనందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వద్దిరాజు కిషన్, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.