08-06-2025 01:17:33 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ(Congress Cabinet Expansion)లో భాగంగా నూతన మంత్రులు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ అధిష్ఠానం సామాజిక సమీకరణాల కోణంలో ముగ్గురిని ఎంపిక చేసింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి(ఎస్సీ-మాల), అడ్లూరి లక్ష్మణ్(ఎస్సీ-మాదిగ), వాకిటి శ్రీహరి(బీసీ-ముదిరాజ్)లకు తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గంలో చోటు దక్కింది.
వివేక్ రాజకీయ ప్రస్థానం..
చెన్నూను నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రముఖ కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి కుమారుడు. తండ్రి వెంకటస్వామి వారసుడిగా రాజకీయల్లోకి ప్రవేశం చేశారు. 2009లో కాంగ్రెస్ తరుపున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2013 అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వివేక్ 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2016లో మళ్లీ టీఆర్ఎస్ లో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వత బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామి 2023 ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు గడ్డం వంశీ పోటీ చేసి గెలిచారు.