07-01-2026 12:22:52 AM
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, జనవరి 6 (విజయ క్రాంతి): ఓటరు జాబితాలో పేరు నమోదు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ మను చౌదరి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని 12 మున్సిపాలిటీలలో తొమ్మిది జిహెచ్ఎంసిలో విలీనంకాగా మిగిలిన 3 (మూడుచింతల పల్లి, ఎల్లంపేట్, ఆలియాబాద్) మున్సిపాలిటిలలో ఎన్నికల నిర్వహాణ నిర్ణయం మేరకు ఓటరు లిస్టు పై పొలిటికల్ పార్టీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించ నున్నందున మున్సిపల్ పరిధిలో ఓటర్ల జాబితా సవరణపై శ్రద్ద వహించాలని ఈ ప్రక్రియలో పార్టీ సభ్యులు తమ వంతు సహాకారం అందించాలన్నారు. అందులో భాగంగా ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో బోగస్ ఓట్లు, డెత్ కేసులను, డబుల్ ఓట్లను తొలగించాలని అన్నారు. ఈసారి జరిగే ఎన్నికలలో బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.
వార్డుల రీ ఆర్గనైజెషన్ లో బూతులు మారిన వారిని సవరించాలని సూచించారు. వార్డులకు సంబంధించిన కాలనీలలో ప్రజలకు అనుకూలంగా ఉండేలా దగ్గరగా బూతులను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ బూతులను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైన మార్పులు చేర్పులకు సంబంధిత ఫారంలలో నమోదు చేసుకోవాలన్నారు. బూత్ లెవెల్ ఎజెన్సీల వారి ద్వారా బోగస్ ఓట్లను తొలగించాలన్నారు.
నిజమైన మార్పులు ఏమైన ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు నిరంతరాయ ప్రక్రియని కొత్తగా నమోదు చేసుకునే వారు ఫారం 6 లో నమాదు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం అన్ని పార్టీల సభ్యులు తెలిపిన సమస్యల పై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా డిఆర్ఓ హరిప్రియ, డిఆర్డిఓ సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ మతిన్, పలు పొలిటికల్ పార్టీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.