13-01-2026 12:00:00 AM
ఆయుష్ బదోనికి పిలుపు
వడోదర, జనవరి 12: టీమిండియాను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. న్యూ జిలాండ్తో వన్డే సిరీస్ ఆరంభానికి కొద్ది గంటల ముందు రిషబ్ పంత్ గాయపడి దూరమైతే.. తాజాగా తొలి వన్డే సమయం లో వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. తొలి వన్డే ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల్లో నొప్పితో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. భారత్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనే మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. దీంతో నితీశ్కుమార్ రెడ్డి సబ్ ఫీల్డ ర్గా వచ్చాడు. అయితే భారత బ్యాటింగ్ సమయంలో నొప్పితో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. రాహుల్తో కలిసి చివర్లో విలువైన పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం స్కానింగ్ తీయగా నొప్పి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తేలింది.
దీంతో మిగిలిన రెండు వన్డేల నుంచి అతన్ని తప్పించారు. టీ ట్వంటీ ప్రపంచకప్ దృష్ట్యా విశ్రాంతినివ్వాలని నిర్ణయించారు. సుందర్ స్థానంలో ఆయుష్ బదోనికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఐపీఎల్లో పలు మెరుపు ఇన్నింగ్స్లతో బదోని గుర్తింపు పొందాడు. అయితే జాతీయ జట్టుకు ఎంపికవడం మాత్రం ఇదే తొలిసారి. బదోని ఇప్పటి వరకూ 56 ఐపీఎల్ మ్యాచ్లలో 963 పరుగులు చేశాడు. కాగా సుందర్ పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవే క్షిస్తుందని, గాయం తీవ్రతపై స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే బదోని రాజ్కోట్ వన్డేకు ముందు జట్టుతో కలుస్తాడని వెల్లడించాయి. అయితే తుది జట్టులో అతనికి చోటు దక్కడం అనుమానమే. సుందర్ స్థానంలో రెండో వన్డేకు నితీశ్ కుమార్రెడ్డికి చోటు దక్కొచ్చు.