04-11-2025 08:00:25 PM
ఎర్రపహడ్ ప్రాథమిక పాఠశాలకు రూ. 50,000 విలువైన వాటర్ ప్లాంట్ విరాళం!
నూతనకల్: తాను చదువుకున్న బడిని మర్చిపోకుండా, ఆ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం కోసం ఒక పూర్వ విద్యార్థిని చూపిన ఔదార్యం అందరికీ ఆదర్శంగా నిలిచింది. మండల పరిధిలోని ఎర్రపహడ్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న దాచేపల్లి స్వరూప సుధాకర్, తన బాల్యాన్ని తీర్చిదిద్దిన ఆ విద్యామందిరంపై ఉన్న మమకారంతో సుమారు రూ.50,000 విలువ చేసే అత్యాధునిక నీటి శుద్ధి యంత్రాన్ని మంగళవారం విరాళంగా అందించి ప్రారంభించారు.
ఈ యంత్రం ద్వారా పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఈ విరాళం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంతుల కళావతి మాట్లాడుతూ... "బడిపై మమకారం, విద్యార్థుల పట్ల ప్రేమతో ఇంతటి మహత్తరమైన దాతృత్వాన్ని చాటుకున్న స్వరూప సుధాకర్ గారిని ఎంతగానో అభినందిస్తున్నాం. తన విజయానికి కారణమైన పాఠశాల రుణం తీర్చుకోవాలని ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం.
వారి ఈ మానవతా కోణం ఇతరులకూ స్ఫూర్తినిస్తుంది," అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు మరియు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయాలనే సుధాకర్ గారి సంకల్పం గొప్పదని ప్రశంసించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం తమ పాత విద్యార్థి చూపిన ఈ ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు.