04-11-2025 10:16:44 PM
అధికారుల కనుసన్నలోనే మట్టి దందా, పర్మిషన్ లేదంటే
టిప్పర్ల అతివేగంతో ప్రజల ఇబ్బందులు, సెలవు రోజుల్లో కూడా రవాణా
అధికారుల అండదండలు మెండుగానే
అమీన్ పూర్: అమీన్ పూర్ బొమ్మల కుంట ప్రభుత్వ భూమిలో నుండి మట్టి రవాణా నిత్య కళ్యాణం పచ్చ తోరణం, 365 రోజులు అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్న పట్టించుకునే అధికారులే లేరా.! అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా శివారులో నుండి మట్టి తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా మట్టి దందాను కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మట్టి తవ్వకాలు పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. వెంచర్లు, సంస్థలకు మట్టిని తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కులు అధికారులతో చేతులు కలిపి మట్టిని తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారుల ప్రజా ప్రతినిధుల అండదండలు మెండుగా ఉండడంతో దందాను కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమీన్ పూర్ మండలం బొమ్మలకుంట గ్రామ శివారులో నుంచి ఈ రవాణా కొనసాగుతుంది. ఈ మట్టి రవాణా గ్రామ శివారులలో నుంచి జరుగుతుండడంతో రోడ్డుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మట్టి రవాణా అమీన్ పూర్ మండలంలోని బొమ్మల కుంట, వడక్పల్లి, జనకంపేట ప్రధాన రహదారి గుండా టిప్పర్లతో, తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై, అక్రమదారుల్లో మట్టి తవ్వకాలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.