04-11-2025 10:10:09 PM
పిల్లల భోజనంపై పరిశీలన సిబ్బందికి సూచనలు..
సిద్దిపేట కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని బాల సధనాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలకు రాత్రి వేళ అందించే భోజన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వంటగదిలో అన్నం, చికెన్, రసం, పెరుగు వంటివి తయారైన విధానాన్ని తనిఖీ చేశారు. ప్రతి రోజు మెనూ ప్రకారం టిఫిన్, లంచ్, స్నాక్స్,డిన్నర్ ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు పాలు, పండ్లు తప్పక అందించాలని ఆదేశించారు.
స్టోర్ గదిలో బియ్యం, పప్పులు, ఇతర సామాగ్రిని పరిశీలించిన కలెక్టర్, కాలం చెల్లిన పదార్థాలు వాడరాదని హెచ్చరించారు.వార్డెన్ బదిలీ అయ్యిందని తెలపగా,కొత్త వార్డెన్ వచ్చేవరకు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు, కూరగాయలు అందించాలంటూ డీడబ్ల్యూఓ శారదకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడిన కలెక్టర్,ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. సిబ్బంది పిల్లలను స్వంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.