బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలి
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అన్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే(Grievance Day)లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.






