12-07-2025 03:35:26 PM
జర్నలిస్టుల నివేషణ స్థలాల సమస్యను పరిష్కరిస్తా
వీలైనంత తొందరగా ఎన్ఓసి ఇవ్వాలని అధికారులను ఆదేశించా
రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్నానని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొంత మంది జర్నలిస్టులు అనర్హులకు పట్టాలు ఇచ్చారని పిర్యాదు చేయడం సమస్యకు కారణమైందన్నారు. జర్నలిస్టుల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు.
అందులో భాగంగా కరీంనగర్ జర్నలిస్టులకు చింతకుంట మల్కాపూర్ లో కేటాయించిన ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ సంబంధించి పత్రాలు ఈఎన్సీ అడ్మిన్ జనరల్ వద్ద నుంచి ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారులకు పంపడం జరిగిందన్నారు. వీలైనంత తొందరగా ఎన్ఓసి ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులతో మాట్లాడిన అనంతరం వీటికి సంబంధించిన పత్రాలను కరీంనగర్ టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులతో హైదరాబాద్ లోని ఉన్నతాధికారుల వద్దకు పంపించినట్లు చెప్పారు. మంత్రిగా, కరీంనగర్ వాస్తవ్యుడుగా స్థానిక జర్నలిస్టులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారికి న్యాయం చేయడం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.