02-05-2025 12:00:34 AM
సూర్యాపేట , మే 1: ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో తిరిగనీయకుండా అడుగడుగునా నిరసనలు తెలియజేస్తామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్ర తెలుసుకోకుండా ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. జగదీష్ రెడ్డి జీవితచరిత్ర అందరికి తెలుసునని, హుజూర్ నగర్ లో డిపాజిట్ కోల్పోయి, సూర్యాపేట కు వచ్చి అదృష్టం బాగుండి, ఎమ్మెల్యే గా గెలిచి, మంత్రిగా పనిచేసి వేల కోట్లు అక్రమంగా సంపాదించారని, గత ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి గెలిచారని అన్నారు.
కెసిఆర్ లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలకే క్రుంగి పోయిందని, రూ. 32 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకూ పనికిరాకుండా పోయిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైన్యం లో పనిచేసి మిగ్ విమానాలు నడిపారని, రాష్ట్రపతి కి సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారని, అందులో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 35 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు, 35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు చేశామని అన్నారు.