సుందరయ్య జీవితం ఆదర్శవంతమైనది
సుందరయ్య స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేద్దాం..
భద్రాచలం (విజయక్రాంతి): రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలలో సుందరయ్య జీవితం ఆదర్శవంతమైందని ఆయన స్ఫూర్తితో పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బి. నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు అన్నారు. పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన సోమవారం కామ్రేడ్ సుందరయ్య 40వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు ఎంవిఎస్ నారాయణ, నాదెళ్ల లీలావతిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ... భూస్వాముల కుటుంబంలో జన్మించిన సుందరయ్య అణగారిన వర్గాల కోసం పరితపించారని అన్నారు.
ప్రజా ప్రతినిధిగా పార్లమెంటులోనూ, శాసనసభలోనూ ప్రజా సమస్యలపై సమగ్రమైన విశ్లేషణతో ప్రసంగించే వారిని అన్నారు. సుందరయ్య నిజాయితీగా, నీరాడంబరంగా జీవించారని అన్నారు. సుందరయ్య చిన్ననాటి నుండే సామాజికంగా జరుగుతున్న వివక్షతను నిలదీశాడని అందుకోసమే తన పేరు చివరలో రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని ముందుకు సాగారని అన్నారు. దేశంలో మొదటిసారిగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి కూలి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించారని అన్నారు.
ఆయన నిరంతర విద్యార్థిగా అనేక అంశాలపై అధ్యయనం చేసేవారని గుర్తు చేశారు. కామ్రేడ్ సుందరయ్య స్ఫూర్తితో భద్రాచలం పట్టణంలో నిర్మాణాత్మకమైన పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగ, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు, డి సీతాలక్ష్మి, ఉస్తేల జ్యోతి, అజయ్ కుమార్, కొలగాని రమేష్, ధనకొండ రాఘవయ్య, డి కనక శ్రీ, ప్రజానాట్యమండలి నాయకులు డేగల మాధవరావు, శాఖ కార్యదర్శులు సీత, గోవర్ధన ఝాన్సీ, సీనియర్ నాయకులు ముత్తయ్య మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






