21-08-2025 01:43:50 AM
కేబుళ్ల వైర్ల తొలగింపుపై హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ పిటిషన్
టీజీఎస్పీడీసీఎల్, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి)ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్ ఎంసీ, సర్వీస్ ప్రొవైడర్లు ఎవరికి వారు చేతు లు దులిపేసుకుంటే ఎలా? ఈ దుర్ఘటనకు అందరు బాధ్యులే.. మనుషులంటే కాస్త ద య చూపాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. రామాంతపూర్లోని గోఖలేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్ వైర్లు తగిలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.
దీంతో కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేబుల వైర్ల తొలగింపుపై భా రతీ ఎయిర్టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టిన నేపథ్యంలో హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. కేబుళ్ల పునరుద్ధరణ సమస్య కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరిని జస్టిస్ నగేష్ భీమపాక ప్రశ్నించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్నందుకు డబ్బు చెల్లిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేబుళ్లు కట్ చేస్తున్నారన్నారు. స్తంభానికి పరిమితికి మించి కేబుళ్లు ఉన్నాయని టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ స్తంభాలపై కేబుళ్ల తొలగింపు పై టీజీఎస్పీడీసీఎల్, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసూ అప్పటి వరకు కేబుళ్లు తొలగించవద్దని ఆదేశించింది.