11-06-2025 12:00:00 AM
వచ్చే నవంబర్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అధికారం నిలుపుకొనేందుకు మిత్రపక్షాలను మార్చుకున్న నితీష్ కుమార్ను ఈసారి ఎలాగైనా గద్దె దించాలని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి సీట్ల పంపకాలు సజావుగా పూర్తి చేసుకొనే పనిలో ఉంది. మరోవైపు బీజేపీ, జేడీ(యు), ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ, బీహార్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహ రచనలో ఉంది.
నవంబర్ 22కల్లా బీహార్లో అసెంబ్లీ ప్రక్రియ ముగియాల్సి ఉంది. 234 స్థానాలున్న అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడంలో, అదే సమయంలో దీపావళి, ఛత్పూజ వంటి ముఖ్యమైన పండుగలు రాన్నుందున రెండు, మూడు దశల్లో పోలింగ్ షెడ్యూల్ ఉండవచ్చు. ఇక ఇప్పటి వరకు జరిపిన ఎన్నికల సర్వేల్లో రాష్ట్రంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో తిరిగి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని తేలింది.
యువజనంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్కు పాప్యులారిటీ కనిపిస్తున్నది. కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీహార్ రాజకీయా ల్లో ఈసారి చక్రం తిప్పాలని పథకాలు రచిస్తున్న ప్రశాంత్ కిషోర్కు రాష్ట్ర ఓటర్లలో పెద్దగా ప్రజాదరణ కనిపించడం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశమంతా పీకేగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ తన జన సూరజ్ పార్టీని వచ్చే అసెంబ్లీ అన్ని స్థానాల్లో పోటీకి నిలపాలని నిర్ణయించారు.
అయితే ఉప ఎన్నికల్లో ఖాతా తెరవలేక పోయిన పీకే పార్టీపై ఇప్పటికే ఎన్నికల సర్వేల్లో ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఒపీనియన్ పోల్స్లో బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ను కోరుకుంటున్న వారే ఎక్కువ మంది. తర్వాతి స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇటీవల తన మనసులో మాట చెప్పారు.
తన లోక్ జన్శక్తి పార్టీ (రామ్ విలాస్) ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విషయమేమిటంటే, రానున్న ఎన్నికల్లో నితీష్ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ ప్రకటించలేదు. అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీకే ఎక్కువ సీట్లున్నా ‘సంకీర్ణ ధర్మం’గా గత ఎన్నికల తర్వాత నితీష్నే బీజేపీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. ఈసారి ఎన్డీఏ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారనేది ప్రశ్నార్థకమే.
ఈ పరిస్థితుల్లో చిరాగ్ పాశ్వాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావాలనుకుంటున్నానని ప్రకటించడం వెనుక మతలబు లేకపోలేదు. మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన చిరాగ్, నితీష్ కుమార్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. బీజేపీకి మద్దతునిస్తున్నా ఆయన గత ఎన్నికల్లో జేడీయూపై అభ్యర్థులను కూడా నిలబెట్టారు.
నితీష్ కుమార్ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయకపోతే ‘సంకీర్ణ ధర్మం’ వుండనే ఉంది. ముఖ్యమంత్రిగా తనకూ అవకాశం రావచ్చునని చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నారు. చిరాగ్ అసెంబ్లీకి పోటీ చేస్తే, ఈసారి ముగ్గురు యువ నాయకులు.. తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్ జయాపజయాలపై అంచనాలు ఆసక్తికరంగా మారనున్నాయి.