13-10-2025 12:00:00 AM
ప్రభుత్వంపై బిజెపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆగ్రహం
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాష్ర్ట మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ని కలిసి ఐకెపి సెంటర్లను త్వరగా ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడానికి శనివారం నాడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ తోపాటు బిజెపి నాయకులను అరెస్టు చేసి మూడు గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టడం పట్ల బిజెపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి వెళ్లిన నాయకులను అరెస్ట్ చేయడం ఆయన తీవ్రంగా ఖండించారు. కొంతమంది పోలీసులు అత్తు ఉత్సాహంతో ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించాలని ఆయన ఆరోపించారు.
రైతులకు ఇవ్వాల్సిన రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని, తిమ్మాపూర్ భూనిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి లు చందా మహేందర్ గుప్త, కాదారి అచ్చయ్య, అప్పల యాదిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల శేఖర్ రెడ్డి, వేముల నరేష్, సెక్రటరీలు కృష్ణ, వైజయంతి, లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షులు బలరాం, మండల అధ్యక్షులు శ్రీ రెడ్డి నాయకులు మంగు నరసింహారావు, ఆకుతోట రామకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టం కపిల్, వినోద్, నాయక్, సిద్దు, నరేష్ యాదవ్, రాములు, మల్లికార్జున్ పాల్గొన్నారు.