13-10-2025 10:45:06 PM
సూర్యాపేట (విజయక్రాంతి): విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు ఓ చెరువు కట్టపై వెళ్తున్న సమయంలో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్తున్న క్రమంలో ఓ చెట్టుని ఢీకొట్టి ఆగడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన జిల్లాలోని మునగాల మండలం నేలమర్రిలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చివ్వెంల మండలం వల్లభాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు గుంజలూరు నుంచి 15 మంది విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని నేలమర్రి వైపు వెళ్తోంది.
చెరువు కట్టపైకి చేరుకోగానే.. మరో వాహనం ఎదురుగా రావడంతో దానిని తప్పిస్తున్న క్రమంలో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి కట్ట పైనుండి చెరువులోకి దూసుకెళ్తుంది. ఈ క్రమంలో కట్టపై ఉన్న చెట్లను ఢీకొని బస్సు నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇది గమనించిన స్థానికులు విద్యార్థులను బయటకుదించారు. జేసీబీ సహాయంతో గ్రామస్థులు బస్సును బయటకు లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సుకు సరైన ఫిట్నెస్ సక్రమంగా లేనికారణంగానే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.