08-05-2025 12:23:03 AM
మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గనున్నాయని రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. ఈ నెల 12వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గురువారం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.