17-07-2025 12:12:07 AM
అనూహ్యంగా ‘ధడక్2’ ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందం త్రిప్తి డిమ్రి. జాన్వీ కపూర్ హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన రొమాంటిక్ ఫిల్మ్ ‘ధడక్’ ప్రేక్షకాదరణ పొందింది. దర్శకుడు షాజియా ఇక్బాల్ దీనికి సీక్వెల్ రూపొందిస్తున్నారని తెలిసినప్పట్నుంచీ తొలి భాగంలో నటించిన జాన్వీనే రెండో భాగంలోనూ కథానాయికగా నటిస్తుందని అంతా అనుకున్నారు.
కానీ, డైరెక్టర్ షాజియా.. హీరో సిద్ధాంత్ చతుర్వేదికి జోడీగా జాన్వీకి బదులుగా త్రిప్తిని తీసుకున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్రెడ్డి వంగా రూపొంది స్తున్న ‘స్పిరిట్’లోనూ త్రిప్తి అనుకోకుండా చేరింది. మొదట ఈ సినిమాలో ప్రభాస్తో జత కట్టాలని కోరుతూ టీమ్ దీపికా పదుకొణెను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. తర్వాత కొన్ని రోజులకు ఈ ప్రాజెక్టులోకి త్రిప్తిని హీరోయిన్గా తీసుకున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది.
అయితే, త్రిప్తి హీరోయిన్గా నటించిన ‘ధడక్2’ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి డిమ్రి తన రాబోయే చిత్రాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. “ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘స్పిరిట్’లోనూ నటిస్తున్నా. ఓ అందమైన సినిమా ఇది. సందీప్రెడ్డి వంగా దీన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను ఉత్సాహంగా ఎదురుచూస్తు న్నా.
అంతేకాకుండా డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో నేను నటిస్తున్నా. అది ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇలా విభిన్నమైన కథల్లో నటించినప్పుడే నటిగా రాణించడం సాధ్యం. పరిశ్రమలోని ప్రతిభావంతులైన దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశం రావడమంటే అదొక గొప్ప బహుమతి. వేర్వేరు వ్యక్తులతో పనిచేయడం వల్ల మంచి అనుభవం గడించవచ్చు. వారి నుంచి కొత్త విషయాలెన్నో నేర్చుకోవచ్చు. కెరీర్లో ముందుకెళ్లడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి” అని తెలిపింది.