16-12-2025 12:51:50 AM
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మ ను, అమలు విధానాన్నీ మార్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాం ధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నాయని సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.
పేదల పొట్ట కొట్టేలా ఉన్న కేంద్ర విధానం పేదలను, రాష్ట్రాలను శిక్షించేలా ఉందని ఆక్షేపించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వీబీ జీ ఆర్ఏఎం జీ’గా మార్చే బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఆ బిల్లును మంత్రి సీత క్క తీవ్రంగా తప్పుబట్టారు. చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చే యాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్రం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అ న్యాయమని ఆగ్రహించారు. ఇది కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.