22 April, 2026 | 10:44 PM

ఏరియా దవాఖానలో అదనపు నిర్మాణాలు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

19-09-2025 11:58 PM

ఎల్బీనగర్: వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అదనపు నిర్మాణాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.  వనస్థలిపురం ఏరియా దవాఖానను శుక్రవారం ఆయన సందర్శించి, వివిధ విభాగాలను పరిశీలిస్తూ రోగులు, డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఏరియా దవాఖానకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వైద్యం కోసం ప్రతిరోజు దాదాపు 1300 నుంచి 1500 మంది వస్తున్నారన్నారు.

దీంతో ఓపీ క్యూలైన్లు సరిపోవడం లేదన్నారు. ఇందులో భాగంగా  ఫార్మసీ, రక్తపరీక్ష కేంద్రాలకు దవాఖాన పరిసరాల్లో  నూతన నిర్మాణాలు నిర్మిస్తామని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని, పనులు పూర్తయితే ఫార్మసీ, రక్తపరీక్ష కేంద్రాన్ని ఇక్కడికి తరలిస్తామన్నారు. నూతన నిర్మాణాలతో ప్రజల తాకిడి తగ్గుతుందన్నారు.  కరోనా సమయంలోనే రెండు షెడ్లు నిర్మించామని గుర్తు చేశారు.