calender_icon.png 20 June, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

104 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ

20-06-2025 12:16:15 AM

మహిళా సంఘాలకు త్వరలోనే 381 డ్రోన్ల పంపిణీ: మంత్రి తుమ్మల 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో 2025-26 ఏడాదికి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారం భించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.104 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి తుమ్మల గురువారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఈ పథకంలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నమో డ్రోన్ దీదీ కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళ సంఘాలకు అందించాల్సిందిగా సూచించారు. వానాకాలం సీజన్‌కు నెలవారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులు, రాష్ట్రానికి సరఫరా అయిన ఎరువుల వివరాలు మంత్రి తుమ్మలకు అధికారులు వివరించారు. 

సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో నిత్యం సంప్రదింపులు జరపుతూ.. రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు సకాలంలో వచ్చేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు.

మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు, జొన్న పంటల దిగుబడులు, రైతుల చెల్లింపులపై మంత్రి తుమ్మల అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈసారి 1,55,257 మెట్రిక్ టన్నుల జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా సేకరించినట్టు వెల్లడించారు. 91 వేల మెట్రిక్ టన్నులకు సంబంధించి రూ.302 కోట్లను రైతులకు చెల్లించినట్టు మంత్రి వివరించారు. 4,333 టన్నుల పొద్దుతిరుగుడు పంటను సేకరించి రూ.31 కోట్లను రైతులకు చెల్లించామన్నారు.

వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సాంకేతికతను, ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

నెదర్లాండ్‌కు చెందిన ఏఆర్‌ఐక్యూటీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారం అందించడం, రైతులు ఇచ్చే ఫిర్యాదులపై ఏఐ ఆధారంగా తక్షణమే సూచనలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి ఇతర అధికారులు పాల్గొన్నారు.