03-01-2026 05:19:48 PM
కుభీర్,(విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయం నిరుపయోగంగా మారింది. గత కొన్ని నెలలుగా మండల వ్యవసాయ అధికారి, విస్తరణ అధికారులు ఈ కార్యాలయం నుంచి కాకుండా కుభీర్ తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న రైతు వేదికలో మకాం వేసి అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో మండల పరిషత్ కార్యాలయం పక్కనే అందరికీ సులభంగా అందుబాటులో ఉన్న వ్యవసాయ కార్యాలయ భవనం వృథాగా మారింది.
మండలంలో 42 జీపీల పరిధిలో ప్రతిరోజూ వందలాది మంది రైతులు వివిధ అవసరాల కోసం కార్యాలయాలకు వస్తుంటారు. అయితే కార్యాలయాన్ని ఒక మూలన ఉన్న రైతు వేదికకు మార్చడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళా రైతులు కార్యాలయాన్ని చేరుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనం ఖాళీగా ఉండటంపై మండల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వ్యవసాయ కార్యాలయాన్ని మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావాలని, లేదా ఇతర ప్రభుత్వ శాఖకు కేటాయించి ప్రజల అవసరాలకు వినియోగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.