13-12-2025 12:14:19 AM
మొయినాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బర్త్ డే వేడుకలను ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుం డా వినియోగిస్తున్న మద్యం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాన్యంతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం ప్రాంతానికి చెందిన పార్థసారథి 20 ఏళ్ల క్రితం నగరంలోని దిల్ సుఖ్ నగర్లో స్థిరపడి, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గురువారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు రెవెన్యూలో భాస్కర ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పార్టీకి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదు.
అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం, హుక్కాలను వినియోగించారు. దీనికి కూడా ఎక్సైజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ పార్టీలో దాదాపు 29 మంది పాల్గొన్నారు. పక్క సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఫామ్ హౌస్పై దాడి చేశారు. పార్టీలో వినియోగించిన మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. సూపర్ వైజర్ సుభాన్, వాచ్ మెన్ షేక్, హుక్కా సరఫరా చేసిన రియాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురికి నోటీసులు ఇచ్చి పంపించినట్లు పోలీసులు తెలిపారు.