10-05-2024 01:02:38 AM
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
వెళ్లేముందు తండ్రికి మెస్సేజ్
నీట్ పరీక్ష మర్నాడే మాయం
కోటా (రాజస్థాన్), మే 9: రాజస్థాన్లో నీట్ కోచింగ్ కేంద్రంగా ఉన్న కోటాలో మరో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తరచుగా వార్తల్లో నిలుస్త్తున్న కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బమన్వాస్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర మీనా అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. అంతకుముందు ఆ విద్యార్థి తన తండ్రి జగదీశ్ మీనాకు వాట్సాప్లో మెస్సేజ్ చేశాడు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర వెళ్లేముందు ఓ మెస్సేజ్ పంపాడు. నేను ఇంటికి రాను. వెళ్లిపోతున్నాను. నాకు పై చదువులు చదవాలని లేదు. నా దగ్గర రూ.8 వేలు ఉన్నాయి. 5 ఏళ్ల వరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తున్నా. మీ అందరి నంబర్లు నా వద్ద ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయను. నా గురించి బాధ పడవద్దని అమ్మకు చెప్పండి. ఏడాదికి ఓ సారి తప్పకుండా ఫోన్ చేస్తా అని సందేశం పంపాడు.
నీట్ ఎగ్జామ్ తర్వాతి రోజే..
మే 6న రాజేంద్ర తన హాస్టల్ నుంచి వెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని జగదీశ్ తెలిపారు. మే 5వ తేదీ ఆదివారం నీట్ ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాతి రోజే రాజేంద్ర అదృశ్యమవడం గమనార్హం. ప్రస్తుతం ఆ విద్యార్థి కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అనేక పోటీ పరీక్షలు ముఖ్యంగా నీట్ కోచింగ్కు కోటా ప్రసిద్ధి చెందింది. చాలా రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటారు. గత కొంతకాలంగా ఇక్కడ విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలంటూ కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది.