10-05-2024 12:59:36 AM
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు దొడ్డిదారి
మెడికల్ అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయం
గంజాయి నియంత్రణ సంస్థ ఏర్పాటు
ఇస్లామాబాద్, మే 9: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. సంక్షోభం నుంచి బయట పడేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. అది అక్రమమా.. సక్రమమా జానేదేవ్.. ముందు డబ్బులు కావాలి.. కష్టాల నుంచి బయటపడాలి.. ఇదీ ప్రస్తుతం పాకిస్థాన్ ఆలోచన. అందుకే అనేక దేశాల్లో నిషేధం విధించిన గంజాయికి రాచ మార్గం వేయాలని చూస్తోంది. వైద్యపరంగా వినియోగించుకునేందుకు గంజాయిని సాగు చేయాలని, ఇందుకోసం నియంత్రణ మండలిని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకుని గంజాయి సాగు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ లైసెన్స్ లేని వారు సాగు చేస్తే జరిమానా విధించాలని నిర్ణయించింది. దీంతో లైసెన్స్ రూపంలో, జరిమానా రూపంలో పాకిస్థాన్ ఖజానాకు డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాకుండా గంజాయిని విదేశాలకు ఎగుమతి చేసి ఖజానా నింపుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఫిబ్రవరిలోనే..
గంజాయి నియంత్రణ సంస్థను ఫిబ్రవరిలో ఏర్పాటు చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ సంస్థ గంజాయి సాగు, సేకరణ, రీఫైనింగ్, తయారీ, వైద్య, పరిశ్రమల్లో వినియోగానికి సంబంధించి గంజాయి అమ్మకాల విషయంలో ఈ సంస్థ పలు బాధ్యతలు నిర్వరిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ గంజాయి మార్కెట్లో భారీగా అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది గంజాయికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 64.73 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం 25 శాతానికి పైగా పెరిగింది. ఇక ఆర్థిక అభివృద్ధి అత్యంత తక్కువగా 1.9 శాతం మాత్రమే ఉంది.