calender_icon.png 6 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసదుద్దీన్ క్లీన్ బౌల్డ్!

06-11-2025 01:11:50 AM

  1. అజారుద్దీన్‌కు మంత్రి పదవి కాంగ్రెస్ ఎత్తుగడ
  2. ఓవైసీ ప్రాభవం తగ్గేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలు
  3. ఎంఐఎం నుంచి ముస్లింలను దూరం చేసేందుకు యత్నాలు
  4. ‘రేవంత్‌రెడ్డి మాస్టర్ స్ట్రోక్.. స్లిప్‌లో ఓవైసీ ఔట్’మీమ్స్ వైరల్

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): తెలంగాణలో ఉన్న ముస్లిం మైనార్టీల జనాభాలో అధిక శాతం హైదరాబాద్ ప్రాంతంలోనే ఉన్నారు. నగరంలో ముస్లింల భాగస్వామ్యం గణనీయంగానే ఉంటుంది. ఎన్ని కల సమయంలో మైనార్టీల ప్రభావం హైదరాబాద్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అన్ని పార్టీల్లోనూ ముస్లిం మైనార్టీలున్నారు. అన్ని పార్టీలకు వారి మద్దతు ఉన్నప్పటికీ అధిక శాతం ముస్లింలు ఎంఐఎం పార్టీ వైపే మొగ్గుచూపుతారు. పాతబస్తీ ప్రాంతంలో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఎంఐఎం పార్టీనే గెలుపొందడమే దీనికి నిదర్శనం.

మొత్తంగా ఎంఐఎం ముస్లిం మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా పేరు తెచ్చుకున్నది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసినా పాతబస్తీ ప్రాంతంలో మాత్రం ఎంఐఎం ప్రభావమే ఉంటుంది. పాతబస్తీని ఎంఐఎం తన కంచుకోటగా మార్చుకున్నది. అయితే క్రమక్రమంగా ఆ కంచుకోటకు బీటలు బారే విధంగా రాజకీయ పరిణామా లు చోటు చేసుకుంటున్నాయి.

దానికి కాంగ్రె స్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్టు కన్పిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం పార్టీ ప్రాబళ్యం తగ్గించేందుకేననే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఒకపక్క మిత్ర పక్షం తరహాలో ఉంటూనే మరో పక్క ముస్లింల నుంచి ఎంఐఎం పార్టీని దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. 

అజారుద్దీన్‌కు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ శాఖలు

తెలంగాణ రాజకీయాల్లో, కూటములు ఎప్పుడు మారుతాయో చెప్పడం కష్టతరం. బౌలర్ వేసే గూగ్లీలా తిరుగుతూ గమ్మత్తునా పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో సీఎం రేవం త్‌రెడ్డి మంచి బౌండరీ కొట్టినట్లుగా ఒక అద్భుతమైన వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో మైనార్టీ వర్గాలకు అవ కాశం కల్పిస్తూ మహ్మద్ అజారుద్దీన్‌ను మం త్రివర్గంలోకి తీసుకున్నారు. అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రై జెస్ శాఖలు కేటాయించారు.

అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధిపత్యాన్ని సవా లు చేసే పరిణామమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా భారత ముస్లింల పక్షానా నిలు స్తూ వస్తున్నారు. ఆయన తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ మజ్లిస్‌ను ముస్లిం సమా జం కోసం బలమైన కోటగా మార్చినట్లే, అసదుద్దీన్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చా రు.

1990లలో టీడీపీ నుంచి, ఆ తర్వాత బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వరకు అన్ని పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓవైసీ మద్దతు తీసుకున్నాయి. దీనికి బదులుగా సంక్షేమ పథకా లు, ప్రత్యేక కోటాలు, పాతబస్తీపై ఆధిపత్యం వంటి పలు విధాలుగా ఎంఐఎం పార్టీ లబ్ధి పొందింది. అయితే దీని వెనుక ముస్లిం వర్గాలను నుంచి ఎవరూ రాజకీయంగా ఎదగకూ డదని ఓవైసీ వ్యూహం దాగి ఉన్నది. 

రాజకీయ ప్రత్యర్థిగా అజారుద్దీన్...

జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీ దగ్గరపడుతుండగా తెలంగాణ రాజకీయ వాతావరణం ఉద్రిక్తతతో నిండిపోయింది. ఎంఐఎం వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పబ్లిక్ ప్రచారం లేదు, ఇంటింటికీ పర్యటనలు లేవు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో సైలెంట్‌గా వెన క్కి తగ్గింది. దీనిపై ఒక కాంగ్రెస్  సీనియర్ నాయకుడు స్పందిస్తూ ‘ఓవైసీ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఆట మైదానం వదిలినట్టుంది’ అని వ్యా ఖ్యానించారు.అయితే ఈ యూ-టర్న్ యాదృచ్ఛికం కాదు, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై ప్రతీకారం తీర్చుకోవడమేనని భావిస్తున్నారు.

దీంతో మైనారిటీ వ్యవహారాలపై ఓవైసీకి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఇప్పు డు తగ్గిపోయింది. గతంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎంను నేరుగా కలవడం, వక్ఫ్ భూములు, స్కాలర్‌షిప్‌లు లేదా మసీ దు వివాదాలపై ఫోన్‌లోనే పరిష్కారం కోర డం సాధారణంగా జరిగేదీ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన తన ప్రత్యర్థి అయిన అజారుద్దీన్‌తో మాట్లాడక తప్పని పరిస్థితి నెలకొంది.

ఒకప్పుడు హైదరాబాద్ మైదానా ల్లో అజారుద్దీన్ ఆడిన ఆఫ్ డ్రైవ్‌లను మెచ్చుకున్న ఓవైసీకి, ఇప్పుడు ఆ వ్యక్తి రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు. ఇద్దరికీ క్రికెట్ పట్ల ఉన్న ప్రేమే ఇప్పుడు విభేదాలతో నిండిపోతుంది. ఓవైసీ క్లబ్ స్థాయి ఆల్ రౌండర్, తన అగ్రెసివ్ షాట్లతో ప్రసిద్ధి పొందారు.అజారుద్దీన్ అయి తే 80, 90లలో భారత్‌ను విజయాల వైపు నడిపించిన కెప్టెన్.ఈ అభిరుచి వారిని కలపాల్సిన బంధమవ్వాలి కానీ, రాజకీయాల కార ణంగా ఇప్పుడు అదే పోటీకి దారి తీసింది. 

ఎంఐఎం భవిష్యత్తుపై.. 

కానీ ఈ పరిణామం కేవలం తెలంగాణ వరకే పరిమితం కాదు. అజారుద్దీన్‌కు, కాం గ్రెస్ అభివృద్ధి హామీలకు ఆకర్షితమవుతున్న యువ ముస్లింల వర్గం ఇప్పటికే ఆయన వైపు మొగ్గుచూపుతోంది. సోషల్ మీడియాలో ‘రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్‌తో స్లిప్‌లో ఔట్ అయిన ఓవైసీ’ అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఈ పరిణామం పార్టీకి ఉన్న 7 మంది ఎమ్మెల్యే ఉన్నా ప్రభావం చూపుతున్న ఎంఐఎం భవిష్యత్తుపై మేఘాలు కమ్ముకుంటున్నట్టు సం కేతమిస్తోంది.

కానీ ప్రస్తుతం సర్వేలు 52 శాతం తేడాతో నవీన్ యాదవ్‌కు ఆధిక్యం చూపుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తే ముస్లిముల ఓటు బ్యాంకు వన్ సైడ్ కాదని స్పష్టమవుతుంది. దీంతో ఓవైసీ వ్యూహాత్మకంగా అభ్యర్థిని నిలపకుండా, కాంగ్రెస్‌కి సైలెంట్ మద్దతు ఇవ్వ డం ఇప్పుడు మిస్‌ఫీల్డ్‌గా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఓవైసీకి కాంగ్రెస్‌కు కౌంటర్ అటాక్...

తెలంగాణ సరిహద్దులు దాటితే, ఓవైసీ ప్రభావం మరింత పెరుగుతుంది. ఎంఐఎం ఇప్పుడు బీహార్‌లో కొత్త ఇన్నింగ్స్ ఆడుతోంది. సీమాంచల్ ప్రాంతంలో 25 మంది అభ్యర్థులను రంగంలోకి దించి, మొత్తం 64 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ‘గ్రాండ్ డెమోక్రాటిక్ అలయన్స్’లో భాగమైంది. కానీ ఇది ఒక హై రిస్క్ లాఫ్టెడ్ షాట్ లాంటిదని, ‘బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి, పరోక్షంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏకి ఓవైసీ సహాయం చేస్తున్నారని’ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓవైసీ మాత్రం తన వ్యూహాన్ని సమర్థించుకుంటూ, ముస్లింయేతర అభ్యర్థులను కూడా రంగంలోకి దించి ‘పార్టీ విస్తరించాలనే ప్రయత్నం’గా చెబుతున్నారు. కానీ ఇది దక్షిణాదిలో ఎదుర్కొంటున్న సవాళ్లను తట్టుకునే హెడ్జ్ మూ వ్ మాత్రమేనని రాజకీయ వర్గాల్లో బలం గా వినిపిస్తున్నది. ఇక కాంగ్రెస్ పక్షాన చూస్తే, ఇది ఒక బ్యాక్‌ఫుట్ నుంచి కొట్టిన సిక్సర్ లాంటిది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అజారు ద్దీన్ రూపంలో కొత్త బలాన్ని సంపాదించా రు.

ఈ వ్యూహం నేరుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై లక్ష్యంగా ఉంది. ఒకప్పుడు ఆయ న కూడా ఓవైసీతో సాన్నిహిత్యం పెంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఓవైసీ మద్దతుదారుల వ్యతిరేకత వల్ల నగర ముస్లిం ఓటు శాతం తగ్గితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదుర్కొన్న అర్బన్ స్లిప్ తిరిగి భవిష్యత్ ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఉప ఎన్నిక కౌంట్ డౌన్ ప్రారం భమైన నేపథ్యంలో తెలంగాణ ముస్లిం రాజకీయ వ్యవస్థ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పరీక్షను ఎదుర్కొంటోంది.

అయితే అజారుద్దీన్ కొత్త మైనార్టీ కూటమిని బలోపేతం చేస్తారా?, లేక ఓవైసీ తన కౌంటర్ అటాక్‌తో ముస్లింలపై తిరిగి పట్టు సాధిస్తా రా అని వేచి చూడాలి. కానీ ప్రస్తుతం పాతతరం రాజకీయ క్రీడాకారుల ప్రాధాన్యత కనుమరుగవుతుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మతం, కులం అనే సరిహద్దులను దాటుతూ, ముస్లిం ఓటరు ఇక కేవలం స్వింగ్ ఓటు కాదు, రాజకీయ ఆట లో కీలక పాత్ర పోషించే ఒక కొత్త చరిత్ర మిగిలింది.  

అజారుద్దీన్ ఎంట్రీ... అసదుద్దీన్‌కు ఫుల్ టాస్

అయితే అజారుద్దీన్ మంత్రివర్గంలో కి తీసుకోవడం ఓవైసీ క్రీజ్‌లోకి నేరుగా వేసిన ఫుల్‌టాస్ బంతిలా మారింది. 99 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన, తన స్కిల్‌లా సాఫ్ట్‌గా ఉండే కవర్ డ్రైవ్‌తో లక్షలాది మందిని మంత్రముగ్ధులను చేసిన 62 ఏళ్ల ఈ లెజెండ్ ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ సమీకరణాలను మార్చగల పరిణామాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఎంఎల్‌సీగా నామినేట్ అయి, కాంగ్రెస్‌కు ఎన్నో ఏళ్లుగా విశ్వాసపాత్రుడిగా ఉన్న అజారుద్దీన్‌ను రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోవడం తో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించినట్టు స్పష్టమైంది.

అయితే, ఇది కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం వేసిన ఎత్తుగడ మా త్రమేనని అటు విమర్శకులు, ఇటు ఎంఐ ఎం వర్గాల్లో వాదిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా బీజేపీతో ఎంఐఎం పార్టీకి లోపాయికారి ఒప్పందం ఉందనే అభిప్రా యం వల్ల ఎంఐఎంకు దూరమైన ముస్లిం ఓటర్లను తిరిగి ఆకర్షించడానికి అజారుద్దీన్‌ను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉప యోగించుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అజారుద్దీన్ ప్రమా ణ స్వీకారం సందర్భంగా ఓవైసీ ఆయన ను కలిసి శుభాకాంక్షలు తెలిపినప్పటికీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఇచ్చిన అనధికార మద్దతును సైలెంట్‌గా ఉపసంహరించుకున్న ట్టు సమాచారం.

అయితే కొద్ది వారాల క్రితమే ఆయన నవీన్ యాదవ్‌కు మద్దతు తెలపాలని ఎంఐఎం క్యాడర్‌కు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకొని ప్రచా రం చేయాలని కూడా సూచించారు. ఎం ఐఎం సీనియర్ నాయకుడు, ఎంఎల్‌సీ మిర్జా రహ్మత్ బైగ్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వీధుల్లో ప్రచారంలో పాల్గొ న్నారు. దీంతో మూడు వైపులా పోటీగా కనిపించిన జూబ్లీహిల్స్ యుద్ధం ఇప్పుడు ద్విముఖ పోరుగా మారింది.