01-07-2025 12:15:38 AM
ఢాకా, జూన్ 30: బంగ్లాదేశ్లో హిందువులపై వరుస ఆకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో 21 ఏళ్ల హిందూ మహిళపై లైంగిక దాడి ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత ఫజోర్ అలీ సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో షేర్ చేసిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కుమిల్లా జిల్లాలోని రామ్చంద్రాపూర్ పచ్కిట్ట గ్రామానికి చెందిన ఫజోర్ అలీ (38) ఈ నెల 26న రాత్రి 10 గంటల సమయంలో ఒక మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. బాధితురాలి భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె తన పిల్లలతో కలిసి ‘హరి సేవ’ పండుగ కోసం తండ్రి ఇంటికి వచ్చింది. అయితే బాధితురాలు ఫజోర్ అలీ వద్ద రూ.35 వేలు అప్పుగా తీసుకున్నట్టు తెలుస్తోంది.
అప్పు కట్టే సమయం మించిపోవడంతో డబ్బులు వసూలు చేసేందుకు ఫజోర్ అలీ బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు మహిళ ఒంటరిగా ఉండటంతో తలుపు తీయడానికి నిరాకరించింది. ఫజోర్ అలీ బలవంతంగా లోపలికి ప్రవేశించి బాధితురాలిని కొట్టి.. ఆపై వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తొలుత బాధితురాలిపై దాడికి దిగిన గ్రామస్థులు..అసలు విషయం తెలుసుకొని ఫజోర్ అలీని పట్టుకొని దేహశుద్ధి చేశారు.
అయితే ఫజో ర్ అలీ వారి నుంచి తప్పించుకుని పారిపోయా డు. మరుసటి రోజు బాధితురాలు తన తండ్రితో కలిసి మురాద్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా.. మహిళలు, చిన్నా రుల వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పరారీలో ఉన్న ఫజో ర్ అలీని ఆదివారం ఉదయం 5 గంటలకు ఢాకాలోని సయదాబాద్ ప్రాంతంలో ప్రత్యేక బృం దాలు అరెస్టు చేయగా..
అతడితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళపై లైంగిక దాడిని నిరసిస్తూ ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేయగా.. బాధితురాలికి న్యాయం జరగాలంటూ హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. బంగ్లా ప్రధాని గా షేక్ హసీనా రాజీనామా తర్వాత దేశంలో మ తోన్మాదులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
మిన్నంటిన నిరసనలు
కాగా హిందూ మహిళపై జరిగిన అమానుష ఘటనపై బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవు తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘హిందువులపై దాడులు ఆపండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను చేత పట్టుకొని ఢాకా వీధు ల్లో ర్యాలీలు నిర్వహించారు.
వీడియో సామాజిక మాధ్యమంలో షేర్ చేయడంపై హిందూ సంఘా లు ఆందోళన బాట పట్టాయి. తాజాగా ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందని కథనాలు వ స్తున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. నిందితులను కఠినంగా శిక్షించేవరకు తమ ఆందోళనలు ఆగవని పేర్కొన్నారు.
గతేడాది నుంచే ఆందోళనలు
బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గతేడాది నుంచే హిందూ సంఘా లు ఆందోళనలు మొదలుపెట్టాయి. 2024 డిసెంబర్లో భారత్లోని ఢిల్లీ, లక్నో, జైపూర్, నాగ్ పూర్ వంటి నగరాల్లో ‘బంగ్లాదేశ్లో హిందువుల నరమేధాన్ని ఆపాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బంగ్లాలో 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అం గీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపైనే దాడులు ఉన్నాయని పేర్కొంది.